ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన

  • బుషెహర్‌లోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసం
  • బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి 
  • రేడియేషన్ లీకేజీపై అణుశక్తి సంస్థ ఆందోళన
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అణు కేంద్రానికి జరిగే నష్టం, దీర్ఘకాలంలో రేడియోలాజికల్ ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించింది.

ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌లో రేడియేషన్ లీకేజీ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. ఆ ప్లాంట్‌లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసి పేర్కొన్నారు.

ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్న ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు ప్రమాదం జరిగితే, రేడియేషన్ లీకేజీ వల్ల ఇరాన్‌తో పాటు ఆ దేశం వెలుపల భారీస్థాయిలో ప్రమాదం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా హెచ్చరించారు.

ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ నిల్వలు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈదాడుల్లో బుషెహర్ ప్రావిన్సులోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ దాడులు బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలోనే జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనితో రేడియేషన్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

IAEA
Iran
Bushehr Nuclear Power Plant
Rafael Grossi
Nuclear Radiation Leakage
Israel
Middle East Conflict

More Telugu News